సాధారణంగా మనం సినిమాల్లో హీరో వేషం వేసిన వారు అందరూ హీరోలలాగా , విలన్ గా చేసినవారిని విలన్ లాగా అనుకుంటాం కానీ అందరూ అలాగే ఉండరు కొంతమంది హీరోలగా చేసినా విలన్ క్యారెక్టర్ చూపిస్తారు.మీకు అందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన చెప్తా , సోనూసూద్ గారు కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేసి తన యొక్క మానవత్వాన్ని నిరూపించాడు. అతను తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే చేశాడు కానీ అతను చేసిన పని చూసి చాలా మందికి గౌరవం కలిగింది . ఎవరైనా ఎలాంటి వారు అన్నది ఇంట్లో ఉండి అయినా చూడాలి లేదా వెంట వెళ్ళి అయినా చూడాలి అంటారు పెద్దలు అప్పుడే వాళ్ళ ప్రవర్తన మనకు పూర్తిగా అర్థం అవుతుంది.
చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని చెప్పే ఒక కథ తెలుసుకుందాం . మహాభారతంలో ధర్మవ్యాధుడు అని ఒకతను ఉండేవాడు అతని కథను చదివితే మీకే అర్థం అవుతుంది చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని.
పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడు,సర్వ ఙ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చొని శిష్యులకు వేదాలు నేర్పుతుండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అది చూసి చిన్న పిల్లలు కదా నవ్వారు వెంటనే కౌశికుడికి కోపం వచ్చింది కొంగ వైపుకి కోపంగా ఒక చిన్న చూపు చూశారు అంతే అది భస్మం అయిపోయింది .
మరుసటి రోజు భిక్షాటనకు వెళ్ళాడు ఒక ఇంటి దగ్గర ఆగి భవతి బిక్షం దేహి అన్నాడు ,లోపలనుండి ఒక స్త్రీ వస్తున్నాను ఉండండి అన్నది .అప్పుడే బోజనానికి కూర్చున్న భర్త పిలవడంతో అతడికి వడ్డించి బయటకు వెళ్ళింది .కౌశికుడికి కోపం వచ్చింది ఎంతసేపు ఎదురుచూడాలి అని కోపంగా అన్నాడు. ఆమె చిరునవ్వుతో నేనేం కొంగని కాదు శపిస్తే భస్మం అవడానికి అన్నది మహర్షి ఆశ్చర్యంతో నీకెలా తెలుసు అన్నాడు. ఆమె మహా పతివ్రత, చేసిన పూజలు పూర్వ జన్మ కారణంగా అన్ని తెలుసుకోగలిగే ఙ్ఞానం ఉంది . అమ్మా క్షమించు ! అని అన్నాడు.మీరు నాకు జ్ఞానబోధ చేయగలరా? అని కౌశికుడు అడిగాడు .
ఆమె నేను కాదు మిథిలా నగరంలో ఒక మాంస వ్యాపారి ధర్మ వ్యాధుడు ఉన్నాడు అతడిని వెళ్ళి కలువు అని చెప్పింది .అతడికి నచ్చలేదు కానీ సరే చెప్పింది కదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని వెళ్ళాడు కౌశికుడు.
కౌశికుడు మిథిలా నగరానికి వెళ్ళి అతడిని చూసాడు ధర్మవ్యాధుడు మాంసం ముక్కలు కొడుతున్నాడు కౌశికుడికి అసహ్యం వేసి ఇతడి దగ్గరా నేను ఙ్ఞానం నేర్చుకోవలసింది అని అనుకున్నాడు ,కానీ ఏం చేస్తాం మనకు తెలియనిది ఎవరు చెప్పినా వినాలి అని అతడిని కలిసి జరిగింది చెప్పాడు , ధర్మవ్యాధుడు గురువర్యా ! మీరు గొప్ప గొప్ప వేదాలు నేర్చుకున్న పండితులు నేను మీకు ఙ్ఞాన బోధ చేసేంతటి వాడిని కాదు అని అన్నాడు . అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ధర్మం అంటే ఏమిటో చెప్తాను అలాగే చూపిస్తా అని కౌశికుడిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు .
ఆ ఇల్లు ఎంతో అందంగా ఉంది అక్కడ ధర్మవ్యాధుడి తల్లి తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ ఇల్లు పిల్లల ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంది. కౌశికుడు ఆ ఇల్లు చూసి చాలా మురిసి పోయాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి యోగ క్షేమాలు అడిగాడు వాళ్ళు చెప్పిన మాట విని కౌశికుడికి నోట మాట రాలేదు. నా కొడుకు మాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు అతని పిల్లలు , భార్య మాకు ఎల్లవేళలా సేవలు చేస్తూ ఉంటారు మాకు కావాల్సింది క్షణాల్లో మా ముందు ఉంచుతారు ఈ వయసులో మాకు ఇంతకన్నా ఏం కావాలి మలిదశలో తల్లిదండ్రుల ఆలనా పాలనా చూసేవారు ఏవరుంటారు.నాకొడుకు కారణ జన్ముడు అతడి నీడలో మేము సంతోషంగా ఉన్నాం అన్నారు.
నేను నా తల్లిదండ్రులను నిత్యం సేవిస్తూ ఉంటూ జ్ఞానాన్ని సంపాదించాను వారి పాద సేవనే నాకు నోము ,వ్రతం లాంటిది మహర్షి . ఙ్ఞానం మనం ఎక్కడికో వెళ్ళి సంపాదించేది కాదు. మన వారితో ఉంటూ నేర్చుకునేది. ముల్లోకాలను చుట్టి రావాలని శివుడు వినాయకుడికి,కుమారస్వామికి చెప్తే,వినాయకుడు తెలివిగా ఆలోచించి తల్లితండ్రుల సేవనే ఉత్తమ మార్గంగా ఎంచుకున్నాడు . అలాగే మనం కూడా మొదట తల్లితండ్రుల సేవకు ప్రాధాన్యం ఇవ్వాలి అని ధర్మవ్యాధుడు చెప్పాడు.
ఇదే బ్రహ్మజ్ఞానం అంటారు గురువర్యా అన్నాడు ధర్మవ్యాధుడు . నువ్వు వృద్ధాప్యంలో వున్న నీ తల్లితండ్రులను వదిలి ఙ్ఞానం సంపాదించడానికి వెళ్ళవు కానీ ఆ ముసలి తల్లిదండ్రులకు నీ అవసరం చాలా ఉంది అని తెలుసుకోలేకపోయావు.వాళ్ళకు నువ్వే ఆధారం అలాంటి వారిని వదిలి నీ అంతటా నువ్వు వచ్చావు అక్కడ వాళ్ళు నీ మీద బెంగతో బాధపడుతూ వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యారు ఇది కూడా నువ్వు తెలుసుకోలేదు.
నిజం గ్రహించిన కౌశికుడు నేను తప్పుచేసాను, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేనే పండితుడిని అని గర్వపడ్డాను వెళ్ళి నా తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను అని అన్నాడు .
ఇంత జ్ఞానం నేర్పించిన నిన్ను చూస్తుంటే వింతగా ఉంది మూడు కాలాలు తెలిసిన వాడివి నీ గత జన్మ రహస్యం ఏమిటో చెప్పగలరా అన్నారు కౌశికుడు .అప్పుడు ధర్మవ్యాధుడు నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిని, నేను రాజకుమారుడు తో స్నేహం చేసి అతనితో పాటు అన్ని విద్యలను నేర్చుకున్నాను. విలువిద్య నేర్చుకున్న నేను ఒకరోజు అడవికి వెళ్లి చాలా జంతువులని వేటాడము ఆ సమయంలో నా బాణము వెళ్ళి ఒక మహర్షికి గుచ్చుకుంది అతడికి గాయం అయింది నొప్పితో విలవిల్లాడదు అతని దగ్గరకు వెళ్లి క్షమించండి మహర్షి అని వేడుకున్నాను . అతడు నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టి హింస చేశారు కాబట్టి ఇచ్చే జన్మలో నువ్వు శూద్ర కులంలో పుట్టి జంతువులను వధించి బతుకుదెరువు తో బతుకుతావు అని శాపించాడు.మెల్లిగా అతడికి గుచ్చుకున్న బాణాన్ని తీశాను వైద్యం చేసి ప్రాణాపాయం నుండి తప్పించాను.అతడు శాపాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు నువ్వు శూద్రుడివి అయినను మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటావు తల్లిదండ్రుల సేవలో తరిస్తావు అని చెప్పాడు. ఇప్పటికీ నేను నా జన్మ సార్థకం చేసుకున్నాను. ఈ కథ వల్ల నీతి ఏమిటో అర్థం అయిందా కసాయి పని చేసాడు ఎప్పుడూ కసాయి వాడు కాదు అది వృత్తి మాత్రమే .కేవలం వృత్తినే ఆధారంగా చేసుకొని మనుషులను అంచనా వేయొద్దు. మనిషి యొక్క ప్రవర్తన వల్ల వారికి గుర్తింపు వస్తుంది తప్ప పని వల్ల కాదు😀
Comments
Post a Comment