మీకు ఎప్పుడూ చెప్పినా మహాభారతం లోని కథలే చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు లోకంలో లేనిది ఏది మహాభారతంలో ఉండదు అని ఒక సామెత. ఒకప్పుడు హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో హిరణ్యధనుస్సు అనే గిరిజన రాజు నివసించేవాడు. అతనికి ఏకలవ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఏకలవ్యుడికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలని కలలు కనేవాడు.
ఆ కాలంలో విలువిద్యలో అత్యంత ప్రఖ్యాత గురువు ద్రోణాచార్యుడు. ఆయన వద్దే కౌరవులు, పాండవులు విద్యలు నేర్చుకుంటుండేవారు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి నమస్కరించి,
“గురువర్యా! నాకు కూడా విలువిద్య నేర్పించండి” అని వినయంగా అడిగాడు.
ద్రోణాచార్యుడు అతని వేషధారణ చూసి,
“నేను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాను” అని చెప్పి తిరస్కరించాడు.
ఆ మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడ్డాడు. కానీ తన కలను వదలలేదు. అడవికి తిరిగి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజూ వారికి నేర్పించేటపుడు చూసి సాధన చేయసాగాడు.
అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి విలువిద్య అభ్యసించేవాడు. రోజులు గడిచేకొద్దీ అతని ప్రతిభ అద్భుతంగా పెరిగింది. లక్ష్యాన్ని ఎప్పుడూ తప్పకుండా బాణం సంధించగలిగే స్థాయికి చేరుకున్నాడు.
ఒకరోజు అర్జునుడు మరియు ఇతర పాండవులు అడవిలో వేటకు వెళ్లారు. వారి కుక్క ఒకచోట మొరుగుతుండగా, ఒక్కసారిగా దాని నోరు బాణాలతో నిండిపోయింది. కానీ కుక్కకు ఎలాంటి గాయం కాలేదు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
“ఇంత అద్భుతమైన ధనుర్విద్య ఎవరిది?” అని వెతుకుతూ వెళ్లగా అక్కడ ఏకలవ్యుడు సాధన చేస్తూ కనిపించాడు.
అర్జునుడు ఆశ్చర్యపడి ద్రోణాచార్యుడిని అడిగాడు:
“గురువర్యా! మీరు నన్నే ప్రపంచంలో గొప్ప ధనుర్ధారి చేస్తానని చెప్పారు. అయితే ఇతడు ఎవరు?”
అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి వద్దకు వెళ్లి,
“నీవు ఎవరి శిష్యుడు?” అని అడిగాడు.
ఏకలవ్యుడు వినయంగా,
“గురువర్యా! మీరు నా గురువు. మీ విగ్రహాన్ని పెట్టుకొని నేర్చుకున్నాను” అని చెప్పాడు.
ద్రోణాచార్యుడు కొద్దిసేపు ఆలోచించి, ఇతను అర్జునుడికంటే గొప్ప ధనుర్ధారి అవుతాడు ,అలా అవడం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు.సరే ఇన్ని రోజులు నా ప్రతిమను ఉపయోగించి విద్య నేర్చావు కనుక నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటనవేలు నాకు ఇవ్వాలి” అన్నాడు.
గురువు మాటను దేవుని మాటగా భావించిన ఏకలవ్యుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బొటనవేలు కోసి గురువుకి సమర్పించాడు.
అప్పటి నుంచి అతను మునుపటిలా విలువిద్య చేయలేకపోయినా, గురుభక్తి మరియు పట్టుదలకు ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాడు.
నిజమైన పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటవచ్చు.
గురువుపై భక్తి గొప్పది.
కష్టపడి సాధన చేస్తే అసాధ్యమేమీ లేదు
Nice
ReplyDelete