Skip to main content

ఎక్కాలు - ఎమోషన్



     ఎక్కాల  పుస్తకం ఎవరు  కని పెట్టారో  కానీ  నా చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. 

ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”.  
 
అందరికీ  బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా.  రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రెండొకట్ల రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు ...”  అంటూ ఒక ప్రత్యేక రాగం లో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్న మాట. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా  ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం.  ఈ  ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్ధం కాదు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది. కాని దాని శృతి/రాగం/తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు. అసలు అది  బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి “ఎక్కము” అనే పేరు వచ్చి వుంటుంది. 

అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తెలియడానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది. అసలు ఇవి ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారూ అని అడిగితే “పెద్దయ్యాక ఉపయోగిస్తాయిరా” అనే సమాధానం వచ్చేది. 

ఇరవై ఇరవైలు దాకా కంఠస్థ పడితే కాని పైక్లాస్ కి పంపము అని ప్రతీ క్లాస్ లోనూ అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు.  ప్రతీ ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది, అలాగే పుస్తకంలో  20వ ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతుచిక్కని ప్రశ్న. బహుశా మన సామర్ధ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని వుంటారు.

ఏ పనికైనా వాయిదా పద్ధతి వున్నట్లు రెండో క్లాస్ లో పది పదుల దాకా చాలు అనేవారు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ పన్నెడు పన్నెడులు, పదహారు పదహార్లు, చివరికి ఇరవై ఇరవైలు దాకా సాగేది. ఎక్కాలు అప్పజెప్పే సమయంలో అందరికీ గుండెలు దడ దడ లాడేవి. అప్పటి దాకా చదివినదే అయినా మాస్టారి దగ్గరకి వచ్చే సరికి  ఆరు ఆర్లు  కాస్తా నలభై రెండు అయిపోయేది. ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్ళీ మొట్టమొదటి నించీ చదివి అప్పజెప్పు అని లైన్ లో చివరికి పంపించే వారు. 

నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎక్కాలు మోసం చేసేవి. అన్నీ చక్కగా అప్పచెప్తూ  ఆరార్లు  ముప్ఫై ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా “ముప్ఫై ఆరా ?”  అని గద్దించే సరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అనడం, రెండు దెబ్బలు తినడం, మళ్ళీ లైన్ లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయేది. 

అప్పట్లో వీడియోలు లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఒక హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్తం వైపు బెరుకు చూపులు చూస్తూ అప్పజెప్తుంటే  భలే వుండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్ధించేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి  రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టారి ద్వారా ప్రసాదించేవాడు. 

ప్రతీ క్లాస్ లోనూ ఒకరిద్దరు ఐన్స్టీన్ లు వుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో  తెలిసేదికాదు గాని టక టకా అప్పజెప్పేసే వాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు జాలిగా చూస్తుండేవారు. మనకి వళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. 

సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండగుర్తులు పెట్టుకునో, బండగా బట్టీ పట్టో మొత్తానికి  ఇరవై ఇరవైల దాకా  అప్పజెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవారు. ఈసారి తలక్రిందుగా అప్పజెప్పాలి అనే వారు. అంటే ఇరవై ఇరవైలు నాలుగొందలు  నించి రెండు ఒకట్ల రెండు దాకా అన్న మాట. పట్టుదలగా అదీ సాధిస్తే ఈ సారి రాండమ్ గా అడిగే వారు. పదమూడు పదిహేళ్లెంత అనో, పద్దెనిమిది పదమూళ్లెంత అనో ఆడగ్గానే మనసులో రాగం పాడుకోడానికి టైమ్ పట్టేది. 

 స్కూల్లో మాష్టర్లే కాదు, ఇంటికొచ్చిన చుట్టాలు,పక్కాలు కూడా కనబడితే చాలు “ఎన్నో క్లాస్ రా నువ్వు ?  ఎన్ని ఎక్కాలు వచ్చు ?  పన్నెడు పద్నాలుగులు ఎంత ?”  లాంటి ప్రశ్నలతో వేధించే వాళ్ళు. అందుకే వాళ్ళని తప్పించుకుని తిరగవలసి వచ్చేది.  
  
ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో వుండేవి. అవి చాలా ఇంటరెస్టింగ్ గా వుండేవి. ప్రతీ  పేజీలోనూ క్రింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో వుండేది. అవన్నీ చక్కగా కంఠతా వచ్చేసేవి.  చివరి పేజీలలో అన్ని భాషల లోనూ తెలుగు వారాల పేర్లు,నెలల పేర్లు,ఋతువులు,తిధులు,నక్షత్రాల పేర్లు వుండేవి. తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషలలొ కూడా వుండేవి.  భాను వారము, ఇందు వారము .. చిత్తి , వయ్యాశీ.. ఇలాగ. నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో వుండేవారికి  దేశంలో తెలుగుతో బాటు వేరే భాషలు కూడా వుంటాయని మొదటి సారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే. అవి చదివేసిన విద్యార్ధులు బహుభాషా కోవిదుల్లా ఫీలైపోయేవారు.  

మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిధుల పేర్లు తెలిసేవి. ఇప్పటి బాలలని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి. 

ఇంతటి ఘన చరిత్ర వున్న ఎక్కాల పుస్తకం ఈనాటి కాలిక్యులేటర్లు, అబాకస్ లు, టాబ్లెట్ ల ధాటికి తట్టుకోలేక మాయమైపోతోంది. దానితోబాటే మన  పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నించీ నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది. ఐ మిస్ యు  -  ఎక్కాల పుస్తకం !!

ఇది చదివిన తర్వాత మీరు కూడా మిస్సవుతున్నారు కదూ? వెంటనే బజారుకెళ్ళి ఓ ఎక్కాల పుస్తకం కొనుక్కుని ఇరవై ఇరవైల దాకా తలక్రిందుగా కంఠస్థం చేయండి. మొబైల్లో  పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేకంటే అదే మంచిది. మైండ్  ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుంటుంది.

నిజానికి ఈ వ్యాఖ్యానం నేను రాసింది కాదు కానీ ఎవరో రాసింది నేను చదివిన తరువాత మాత్రం నిజంగా నాకు అన్ని జ్ఞాపకంకి వచ్చింది. ప్రతీసారి ఆ ఎక్కాలు నేర్చుకోవడానికి పడిన తిప్పలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.టీచర్ ఎక్కాలు నేర్పించడానికి వేల్లో మధ్యలో పెన్సిల్ పెట్టి గట్టిగా నొక్కి కొట్టింది గుర్తుకు వచ్చింది.ఎక్కాలు ఒక ఎమోషన్ అంతే.అవి నేర్చుకోవడం పెద్ద టాస్క్ అనిపించేది.సో ప్రతి ఒక్కరికి నాలాగ ఎక్కాల మెమోరీస్ ఉంటాయని అనుకుంటూ ఈ పోస్ట్ ను రీపోస్ట్ చేస్తున్న.








Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .