వాతాపి జీర్ణం కథ..
చిన్న పిల్లలకు అన్నం తినిపించిన వెంటనే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారో తెలుసా? అయితే ఈ కథ చదవండి. వాతాపి జీర్ణం కథ పురాణాలలో ప్రసిద్ధమైన ఒక ఆసక్తికరమైన కథ.
ఒకప్పుడు వాతాపి, ఇల్వల అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వీరు బలవంతులు మరియు మాయలమారులు . వారు తమ తెలివితేటలను మంచికి కాకుండా దుర్మార్గానికి ఉపయోగించేవారు.ఋషులను మోసం చేసి చంపడం తమ అలవాటుగా చేసుకున్నారు.
ఇల్వల బ్రాహ్మణ వేషం వేసుకొని అతిధి సత్కారం పేరుతో అడవులలో తిరిగే ఋషులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు. వాతాపి అనే తన తమ్ముడిని మాయశక్తితో మేకగా మార్చి, ఆ మేకను వండి అతిథులకు భోజనంగా పెట్టేవాడు. అది మామూలు ఆహారం అని భావించి వారు భోజనం చేసేవారు.
ఋషులు ఆ మాంసం తిన్న తర్వాత, ఇల్వల “వాతాపి! బయటకు రా!” అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి మళ్లీ తన అసలు రూపంలోకి వచ్చి, ఋషుల పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అనేకమంది ఋషులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారు ఋషులను తినేవారు.
ఈ విషయం ఆనోటా ఈ నోటా అగస్త్యుడికి తెలిసింది. సరే ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. అసలే సముద్రాన్నే కడుపులో దాచుకున్న మహర్షి .
ఒక రోజు అగస్త్య మహర్షి వారి ఇంటికి వచ్చాడు. అతనికి కూడా అదే విధంగా భోజనం పెట్టారు ఆ సోదరులు . అగస్త్యుడు అన్నీ తెలిసి కూడా ప్రశాంతంగా భోజనం చేశాడు.
భోజనం అయ్యాక ఇల్వల “వాతాపి! బయటకు రా!” అని పిలిచాడు.
అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు: “వాతాపి జీర్ణం!”
అంటే — “వాతాపి నా కడుపులోనే జీర్ణమైపోయాడు” అని అర్థం.
అతని తపస్సు శక్తితో వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు, బయటకు రావడానికి అవకాశం లేకపోయింది.
దాంతో ఇల్వల తన తమ్ముడిని కోల్పోయి, అగస్త్యుడి శక్తికి భయపడి పారిపోయాడు.
దుర్మార్గానికి చివరికి శిక్ష తప్పదు
జ్ఞానం మరియు తపస్సు శక్తి ఎంత గొప్పదో తెలియజేసే కథ ఇది.
Comments
Post a Comment