మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా
అలుపని రవ్వంత అని అనవంట
వెలుగులు పూస్తవు వెళ్ళే దారంతా.
ఈ పాట వింటే ప్రతి ఒక్కరి కంట్లో చిన్న కన్నీటి చెమ్మ వస్తుంది , ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ పాత్ర అలాంటిది.
ముఖ్యంగా తెలుగు ఇళ్లలో ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గు వేస్తే ఆ ఇంటి కల వేరుగా ఉంటుంది నా చిన్నప్పటి నుండి అది ఒక ఎమోషన్. స్త్రీలు బాల్యం నుండి అల్లారు ముద్దుగా పెరిగి వివాహం అయిన తర్వాత వేరే ఇంటికి వెళతారు. అక్కడ వాళ్ళను కూడా సొంత ఇంటి వారిగానే భావించి కలిసి పోతారు. వాళ్ళు కొన్నిసార్లు ఇష్టాలను చంపుకొని,బాధను దిగమింగి తల్లితండ్రులకు మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తారు.ఆమె లేని ఇల్లు ఒక నరకం అని చాలా మంది అభిప్రాయం.భర్తకు భార్యగా సేవలు చేస్తుంది అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి అన్ని పనులు చేస్తుంది వాళ్ళ వంశం అభివృద్ధి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంకొక ప్రాణానికి ఊపిరి పోస్తుంది ఇన్ని చేసినా కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం ఎప్పుడూ ఆశ పడదు.ఇలా చాలా మంది మహిళలు ఉన్నారు.
ప్రపంచ జనాభాలో సగం మంది జనాభా ఆడవాళ్లు అయినా కూడా వాళ్ళ గొంతుక వినపడదు.అభివృద్ధి చెందిన దేశాలలో,అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా మహిళల గొంతుక వినపడదు.ఆకాశంలో సగం ,అని చెప్తారు తప్ప ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.స్త్రీల జీవితం చాలా మలుపులు ఆటుపోట్లతో ఉంటుంది. పుట్టుక నుండి అంతటా వివక్ష నే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు బాలిక అని తెలిస్తే అబార్షన్. ఇది అరికట్టడానికి ప్రభుత్వం PCPNDT చట్టం చేసింది అయిన కూడా కొంత మంది బాలికలు బలి అవుతున్నారు. విద్య కోసం కూడా బాలికలు చాలా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని చోట్ల స్త్రీ లను చిన్నచూపు చూడడం వంటివి జరుగుతూ ఉన్నాయి. వివాహం తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది . ఒక స్త్రీ ఇంటర్వ్యూ లో అమ్మాయిలకు సొంత ఇల్లు లేదు తెలుసా అని అంటే ఆమెను ఎంత మంది ఆమెను సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్ చేశారు తెలుసా.నిజానికి ఆమె చెప్పాలి అనుకున్న మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఎవరికి అవసరం లేదు .పెళ్లి అయిన తర్వాత అన్ని అత్తగారిల్లే కానీ ,అదే అతింట్లో ఒక చిన్న మాట ఆమె ఎదురు మాట్లాడినా కూడా ఆమెను విమర్శించే వాళ్ళు తప్ప ,తనకు సపోర్ట్ చేసేవారు ఉండరు.చివరకు మొగుడు కూడా ఆమె వైపు నిలబడడు కొన్ని సందర్భాల్లో. ఇంట్లో నుండి వెళ్ళిపో ఇది నీ ఇల్లు కాదు అంటారు అప్పుడు ఆమె మానసిక స్థితి ఏమిటో ఎవరికి అర్థం కాదు .
గుడిలో వున్న అమ్మవారికి చేతులు ఎత్తి దండం పెడతాం కానీ ఇంట్లో వున్న ఆడవారిని గౌరవించ దానికి మాత్రం ఆలోచిస్తాం.
కాలం మారింది నేటి తరం మహిళలు జీవితాన్ని పోరాడి గెలుస్తున్నారు వాళ్లు అన్ని రంగాలలో కూడా తమదైన ముద్ర వేశారు.ఎంతసేపు మహిళల గొప్పదనం గురించి చెప్తే మగవాళ్ళు కూడా ఫీల్ అవుతారు కానీ నిజానికి ప్రతి మగవాడికి తెలుసు వాళ్ళ జీవితంలో ఆమె లేని లోటు ఎంతుందో అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే పురుషులు బలవంతులు అని వాళ్ళు తక్కువ కావొద్దని అనుకుంటారు.ఇది పితృస్వామ్య వ్యవస్థ కదా ! కొన్ని తెగలలో మాతృస్వామ్య వ్యవస్థ కూడా ఉంది భారతదేశంలో మేఘాలయ లోని ఖాసి తీగ ,కేరళలో నాయర్ తెగలలో ఈ ఆచారం మనకు కనిపిస్తుంది.
ఒక సర్వే ప్రకారం ప్రతి ఏటా 14 శాతం మంది మహిళలు కుటుంబ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .ఇది ప్రపంచ సగటు కన్నా ఎక్కువ.యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంత దేవతా" అన్నారు పెద్దలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ప్రతీతి.గౌరీశంకరులు అది దంపతులు వారు మానవాళికి ఆదర్శ దంపతులు. స్త్రీ ,పురుషులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,గౌరవం, ప్రేమ ఉండాలి.నారాయణుడు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని, బ్రహ్మ సరస్వతిని గౌరవించారు అదే గౌరవం సమాజంలో స్త్రీల పట్ల ఉండాలి అని పురాణాలు చాటి చెప్పాయి.ఎక్కడో ఉన్న గుడిలోని దేవతమూర్తికి వంగి వంగి దండాలు పెడతాం ,అమ్మా కాపాడు అని ప్రార్దిస్తాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ ,సరస్వతి, పార్వతిని మాత్రం చులకనగా చూస్తాం.స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు.స్త్రీల యొక్క ప్రయాణం ఎన్నో అవరోధాలను కలిగి ఉంటుంది.అయినా వారు అన్ని ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.ప్రయాణం ముఖ్యం కాదు గమ్యస్థాననికి చేరుకోవడం ప్రధానం అంటారు పెద్దలు.స్త్రీల పట్ల దయ ,జాలి ,కరుణ ఉండాల్సిన అవసరం లేదు కానీ వారి హక్కులను నియంత్రించకుండా ఉంటే సరిపోతుంది.కాలం మారింది కానీ సనాతన సంప్రదాయాలు,కట్టుబాట్లు కొన్ని మారడం లేదు.అరవింద సమేత సినిమా లో ఆడవాళ్లకు రాజకీయలా అంటే పాలిచ్చే తల్లులకు పరిపాలించడం ఒక లెక్కనా అంటుంది .మనందరి జీవితంలో తల్లి యొక్క పాత్ర అమోఘం.అలా అని పురుషుడు గొప్ప కదా అని ప్రశ్న పుడుతుంది మనసులో, స్త్రీ, పురుషులు ఇరువురూ ప్రధానమే కానీ పురుషాహంకార ధోరణి మాత్రం సరైనది కాదు అనేది ఈ వ్యాఖ్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
సమాజంలో స్త్రీలు ఒక్కో కాలానికి ఒక్కో రకంగా పరివర్తన చెందుతున్నారు. పూర్వకాలంలో వేద విద్యలు నేర్చుకున్న లోపముద్ర,గార్గి, రచనలు చేసిన కవయిత్రి మొల్ల,దేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లిం మహిళ రాజియా సుల్తానా ,రాణి రుద్రమదేవి,ఝాన్సీ లక్ష్మీభాయ్, చరిత్రలో నిలిచిపోయారు.ఈ తరానికి కాస్తూర్భా గాంధీ,విజయలక్ష్మీ పండిట్,సరోజిని నాయుడు,ఆనంది బెన్ పటేల్(మొదటి మహిళ వైద్యురాలు) ,వీరనారి చాకలి ఐలమ్మ ఇంక ఎందరో ఉన్నారు.స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఉషా మెహతా స్వతంత్ర పోరాటంలో ఏకంగా ఒక రేడియో ను నిర్వహించేది.ఇప్పుడు పి.టి ఉష కరణం మల్లేశ్వరి క్రీడలు, ఇందిరాగాంధీ,సుష్మాస్వరాజ్ రాజకీయాలు, మిథాలి రాజ్ మొట్టమొదటి మహిళ క్రికెటర్ ,సునీత విలియుమ్స్ ,కల్పన చావ్లా మొదలగువారు వున్నారు.సినిమాలు ,రాజకీయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో స్త్రీలు తమ పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు .మహిళామణులు గతాన్ని గుర్తు చేసుకుంటూభవిష్యత్తును మీకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోండి.ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తే...
మహిళలకు ప్రోత్సాహకాలు అందించాలి వారి అభ్యున్నతికి సహాయం చేయాలి. దెబ్బతిన్న మహిళలకు ఆసరా అవ్వాలి. అన్ని రంగాలలో స్త్రీలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి అలా చేసినపుడు ప్రతి రోజు మహిళా దినోత్సవమే.
🙏Happy women's day 💐💐
ReplyDelete