సమ్మక్క - సారలమ్మ జాతర

 తెలంగాణ కుంభమేళా 

ప్రస్తుతం తెలంగాణలో ఎవరి నోటా విన్నా ఒకటే మాట ,దారులన్నీ ఒకటే బాట అదే మన 
సమ్మక్క సారక్క జాతర . సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళ ఒకసారి వస్తుంది మాఘమాసంలో పౌర్ణమి కి నాలుగు రోజుల ముందు అవుతుంది .ఈ జాతరలో నడిపించేది అంత ఒగ్గు పూజారులు .వాళ్ళే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తారు.4 రోజుల జాతర.  బెల్లమే బంగారగా  సమర్పించి  ఇక్కడ  అమ్మవారిని   కొలుస్తూ  ఉంటారు  ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సామూహిక భక్తికి ప్రతీక .ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో వెదురు కర్రలు,కుంకుమ బరినలు వనదేవతల ప్రతిరూపాలు.పెద్ద హంగు ఆర్భాటాలు లేని గోపురం గోడలు లేని గుడి మన సమ్మక్క సారలమ్మ లది.ఆదివాసీల విశ్వాసాల ఆలంబనగా వర్ధిల్లుతుంది ఈ జాతర.పెద్ద నైవేద్యం కూడా లేదు బెల్లం కేవలం బెల్లం మాత్రమే ప్రసాదంగా అదే బంగారగా , నిలువెత్తు బరువుగా ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తారు.
  జాతరలో మొదటిగా కన్నెపల్లి నుండి సారలమ్మ వస్తుంది,తర్వాత పులిగొండ్ల నుండి పగిడిద్దరాజు,కొండాయి నుండి గోవిందరాజుల  ప్రతిరూపాలు మేడారం గద్దెల మీదకు తీసుకొని వస్తారు.రెండవ రోజు మందిరసారే పేరుతో చిలకలగుట్ట నుండి సమ్మక్క రూపాన్ని ప్రధాన పీఠానికి తెస్తారు. మండేమాలిగ పేరిట సమ్మక్కకు మొదటి పూజలు చేస్తారు.మూడోరోజు భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు.నాలుగోరోజు సాయంత్రం వనదేవతలను అరణ్యానికి సాగనంపుతారు. ఆహ్వానం,ఆగమనం,ఆరాధనం,నిష్క్రమణం అనే నాలుగు అంశాల ఆధారంగా ఈ జాతర జరుగుతుంది.
ఈ  జాతరకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి .దండకారణ్యంలో మేడారం పరిగణ కు మేడరాజు సామంత పాలకుడు.ఆయన వేటకు వెళ్లినపుడు పులుల మధ్య సంచరిస్తున్న దివ్యాంశతో కూడిన బాలిక కనిపించిందట .జగన్మాత  వరప్రసాదంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు.కాలక్రమంలో మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం జరిపించాడు.వారికి కలిగిన సారలమ్మ,జంపన్న. కాకతీయ రాజులకు సామంతులైన కోయరాజులు కరువు కాటకాల వల్ల కొన్నేళ్లు కప్పం చెల్లించక పోవడంతో ఆగ్రహంతో ప్రతాపరుద్రుడు వారిపై దండెత్తాడు .యుద్ధంలో పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. ఆనాడు జంపన్న ఆత్మార్పణం చేసుకున్న సంపెంగ వాగు నేడు జంపన్న వాగుగా మారిపోయింది.బిడ్డల మరణవార్త విని అపరకాలికగా కాకతీయ సైన్యంపై విరుచుకుపడిన సమ్మక్కను కాకతీయ సైన్యం వెన్నుపోటు పొడిచింది.
తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తసిక్త దేహంతో ,చిలకలగుట్ట పైకి వెళ్ళి తన రక్తమే కుంకుమ భరణి రూపంగా మారి వెదురు కర్రగా ఆకృతిగా దాల్చిందంటారు.సమ్మక్క  ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసిన ప్రతాపరుద్రుడు ఆమెను వనదేవతగా భావించి భక్తుడిగా మారి జాతరను ప్రారంభించాడంటారు.అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
ఈ జాతర ఒక మహిళ యొక్క వీరత్వానికి,పరాక్రమానికి నిదర్శనం.జనం మధ్యలో తిరిగి జనానికి ధైర్యం ఇచ్చి ఆమె దేవతగా రూపొందిన కథ మన సమ్మక్క సారలమ్మలది.
ఆదివాసి మహిళా పోరాట పటిమకు రాజు కట్టిన పట్టం ,ఆయన మొదలుపెట్టిన ఘట్టం ఈ జాతర.ఈ జాతరకు ప్రజలు  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తారు.ఇసుకేస్తే రాలనంత జనంతో ఉంటుంది.





Comments

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

అంతా మన మంచికే...

ఐకమత్యమే మహాబలం.